అమరావతి: మూడనెలలుగా ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోన్న ఒకే ఒక్క పేరు కరోనా వైరస్. భూగోళాన్ని చుట్టేసిన ఈ వైరస్ వేలమందిని పొట్టన పెట్టుకుంది. లక్షలాది మందిలో తిష్ఠ వేసుకుని కూర్చుంది. ఈ కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ దాని మీద దృష్టిని కేంద్రీకరించాయి. దాన్ని నియంత్రించడానికి సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. భారత్పైనా పంజా విసిరిందీ వైరస్. దీన్ని నియంత్రణపై అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి.
ఇంతా చేస్తున్నప్పటికీ.. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. భారత్లో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 169కి చేరింది. రోజురోజుకూడా ఈ సంఖ్యలో గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. దీనిపై ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సన్నిహితుడు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వాని ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కరోనా వైరస్ బారి నుంచి ఇక ఆ దేవుడే ఈ ప్రపంచాన్ని కాపాడాల్సి ఉందని ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు.