ఏపీలో ఇక ఎక్కడికైనా వెళ్లొచ్చు.. ప్రయాణికులకు ప్రత్యేక పాసులు!

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌ డౌన్‌ విధించడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాలు చేసేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే కొంత మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన జగన్ సర్కార్ వినూత్న నిర్ణయం తీసుకుంది.


అత్యవసర సేవలకు ప్రయాణాలు చేసే వారి కోసం కోవిడ్‌ 19 అత్యవసర రవాణా పాసులు అందిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాసుల జారీకి అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొంది. అత్యవసర కారణాలను చూపి ప్రజలు ఈ పాసులు పొందొచ్చని వెల్లడించింది.

పాసులు కావాలనుకునేవారు.. పేరు, పూర్తి చిరునామా, ఆధార్‌ కార్డు వివరాలు, ప్రయాణించే వాహనం నంబర్‌, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనే పూర్తి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత సాధ్యమైనంత త్వరగా సంబంధిత పోలీసు అధికారులు పాసులు జారీ చేస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం హెచ్చరించింది.

అప్లయ్‌ చేయడం ఇలా..
కోవిడ్‌-19 ఎమర్జెన్సీ వెహికల్‌ పాసులు కావాలనుకునే ప్రజలు తాము నివసిస్తున్న ప్రదేశానికి సంబంధించి వివరాలతో ఆయా జిల్లా ఎస్పీల వాట్సాప్‌ నంబర్‌ లేదా మెయిల్‌ ఐడీకి అనుమతి కోరుతూ అప్లయ్‌ చేయాలి. వారు అన్ని పరిశీలించిన తర్వాత సంబంధిత వ్యక్తికి మొబైల్‌ నెంబర్‌/ మెయిల్‌ ఐడీకి పాస్‌ను పంపిస్తారు. జిల్లా ఎస్పీ వాట్సాప్‌ నెంబర్‌/మెయిల్‌ ఐడీ నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఫార్వార్డ్‌ చేసిన అనుమతులు (పాసులు) చెల్లవు. ప్రయాణించేటప్పుడు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని డీజీపీ కార్యాలయం సూచించింది.