ఏపీలో షాపులు ఓపెన్‌! కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలకు అనుమతి కోవిడ్‌–19 నియంత్రణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్షలో నిర్ణయం జాగ్రత్తలతోనే కరోనాని జయించగలం ప్రజల్లో భయాన్ని పోగొట్టి అవగాహన పెంచాలి ఏపీలో అడుగుపెట్టేవారికి వైద్య పరీక్షలు, ఐసోలేషన్‌పై ప్రొటోకాల్‌కు ముఖ్యమంత్రి ఆదేశం నేటి నుంచి రాష్ట్రానికి ప్రవాసుల రాక ప్రారంభం విమానాశ్రయాల నుంచి క్వారంటైన్‌లకు ఉచిత బస్సు సౌకర్యం

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలను తెరిచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌–19 నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్‌ అనంతరం రాష్ట్రాల మధ్య రాకపోకలపై అనుసరించాల్సిన విధానాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యాంశాలు ఇవీ..


భయాన్ని పోగొడుతూ అవగాహన పెంచాలి..
► కరోనాపై ప్రజల్లో భయాన్ని పోగొడుతూ భౌతిక దూరం లాంటి జాగ్రత్తలపై అవగాహన కల్పించడం ద్వారా వైరస్‌తో సమర్థంగా పోరాడగలమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ తాజా పరిస్థితి గురించి వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ సమావేశంలో వివరించారు. వలస కార్మికులపై కోవిడ్‌ –19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌  కృష్ణబాబు వివరాలు అందచేశారు. 
► విదేశాల్లో చిక్కుకుపోయిన వారు సోమవారం నుంచి ఏపీకి రావటం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. అమెరికా నుంచి వచ్చే ప్రవాసులు ముంబై, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లోని విమానాశ్రయాలకు చేరుకుంటారు.
► సీఎం ఆదేశాల ప్రకారం వీరికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉచితంగానే అన్ని వసతులు కల్పించేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయాల నుంచి క్వారంటైన్‌ కేంద్రాలకు చేరుకునేందుకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలని సీఎం సూచించారు.


సకల సదుపాయాలు..
► ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి వస్తున్న వారికి ఏ రాష్ట్రం కూడా ఇన్ని సదుపాయాలను కల్పించడం లేదని అధికారులు పేర్కొన్నారు.
► ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను వారి స్వస్థలాలకు పంపేటప్పుడు ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా వారికి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు.
► ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు, కొన్ని గ్రూపులకు చెందినవారు ఏపీకి తిరిగి రావటానికి తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నామని అధికారులు చెప్పారు. 


గమ్యం చేరేదాకా యాప్‌తో ట్రాకింగ్‌..
► వివిధ రాష్ట్రాల నుంచి 11 చెక్‌పోస్టుల ద్వారా ఏపీలోకి ప్రవేశించవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత అనుమతించిన గమ్యానికి చేరుకునే వరకు యాప్‌ ద్వారా ట్రాక్‌ చేస్తామని వివరించారు. అనంతరం వారి వివరాలను గ్రామంలో వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, సచివాలయ హెల్త్‌ అసిస్టెంట్‌కు చేరవేయాలని సీఎం సూచించారు.
► హోం క్వారంటైన్‌ పాటించేలా చేయడం, పరీక్షలు, వైద్య సదుపాయాలు, ఆస్పత్రికి తరలించడం లాంటి కార్యక్రమాలు కొనసాగేలా చూడాలని సీఎం ఆదేశించారు.  
► హోం క్వారంటైన్, క్వారంటైన్‌ నుంచి పంపించేటప్పుడు అనుసరించాల్సిన ప్రోటోకాల్‌పై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసిందని అధికారులు తెలిపారు. వీటిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసేలా స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్స్‌ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు.


లాక్‌డౌన్‌ తరువాత ప్రొటోకాల్‌పై చర్చ
లాక్‌డౌన్‌ అనంతరం రాష్ట్రంలోకి రాకపోకలు, కదలికలు ప్రారంభమయ్యాక ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అనుసరించాల్సిన హెల్త్‌ ప్రొటోకాల్‌పై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.


ఒక వ్యక్తి ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి అడుగుపెట్టేటప్పుడు ఎలాంటి వైద్య పరీక్షలు చేయాలి? ఐసోలేషన్‌ విధానం ఎలా ఉండాలో ప్రొటోకాల్‌ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.


రాష్ట్రంలో ఒక్క ల్యాబ్‌తో ప్రారంభమైన కోవిడ్‌–19 నియంత్రణ చర్యల ప్రయాణం ఇవాళ దేశంలోనే అత్యధిక పరీక్షలు చేసే స్థాయికి చేరుకుందని, గట్టిగా పనిచేసి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలుగుతున్నామని సమావేశంలో అధికారులు పేర్కొన్నారు.