Delhi: రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. కొవిడ్-19 కారణంగా వాయిదాపడ్డ రాజ్యసభ ఎన్నికలను జూన్ 19న నిర్వహించడానికి ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది.
రాజ్యసభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జూన్ 19న ఎన్నికలు నిర్వహించనుంది. 18 రాజ్యసభ స్థానాలకు ఆ రోజు ఎన్నికలు జరుగనున్నాయి. ఖాళీ అయిన ఈ స్థానాలకు గతంలోనే ఎన్నికల తేదీలు ఖరారు చేసినప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం వీటికి మరోసారి తేదీ ఖరారు చేస్తూ సోమవారం (జూన్ 1) నిర్ణయం తీసుకుంది. జూన్ 19న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టడానికి ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.