జగన్‌తో విభేదాలు.. స్పందించిన విజయసాయిరెడ్డి


జగన్‌తో విభేదాలు వచ్చాయన్న వార్తలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తాను చనిపోయేవరకు జగన్ విషయంలో విధేయుడిగానే ఉంటానన్నారు. ఆయన కుటుంబానికి కూడా విధేయుడిగానే ఉంటానన్నారు.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పార్టీలో అత్యంత సన్నిహితుడు ఎవరంటే... టక్కున వచ్చేది విజయసాయిరెడ్డి పేరు. ఎప్పడూ జగన్ వెంటే ఉంటారు. రాష్ట్ర పర్యటలకైనా.. కేంద్ర పర్యటనలో అయినా జగన్ వెంటే ఉంటూ అన్నీ చూసుకుంటారు సాయిరెడ్డి. జగన్ ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం... వివిధ పథకాల ప్రకటన వరకు అన్ని విషయాల్లో సాయిరెడ్డి జోక్యం చేసుకున్నారు. ఎప్పుడూ సీఎం వెన్నంటే వుండే విజయసాయిరెడ్డి విషయంలో గత కొన్నిరోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎంతో సన్నిహితంగా ఉండే జగన్‌కు ఆయనకు మధ్య మనస్పర్థలు వచ్చాయని మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై సాయిరెడ్డి స్పందించారు.

 

తాను చనిపోయేవరకు సీఎం జగన్‌కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ విషయంలో తనను శంకించాల్సిన పనిలేదన్నారు. ''నాకు, మా అధ్యక్షుడు జగన్‌కి ఎలాంటి విభేదాలు లేవు..రావు'' అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థని కించపరిచే ఉద్దేశంగానీ.. అగౌరవపరిచే ఉద్దేశం ఏ ఒక్క వైసీపీ కార్యకర్తకు లేదన్నారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు అడ్డగోలుగా పెట్టిన పోస్టులకు.. కేసులు పెట్టి అరెస్ట్‌ చేసి ఉంటే ఎన్ని జైళ్లు అయినా సరిపోవన్నారు విజయసాయిరెడ్డి . వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై గత ప్రభుత్వం అనేక కేసులు పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మరోవైపు ఏపీ మాజీ ఎస్ఈసీ వ్యవహారం కూడా విజయసాయిరెడ్డి మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్‌కుమారే ఎస్‌ఈసీగా ఉండాలని టీడీపీ కోర్టుకు వెళ్లడం ఏంటి? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం లేకున్నా..వాళ్ల మనుషులే ఉండాలనుకుంటున్నారన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వంపై విషం కక్కారని మండిపడ్డారు సాయిరెడ్డి. నిమ్మగడ్డ రాసిన లేఖలో ఏవేవి ఉన్నాయో అన్నీ చూశామని, టీడీపీ కార్యాలయంలోనే ఆ లేఖ తయారైందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. అలాగని తాము న్యాయవ్యవస్థను కించపరచడం లేదని, హైకోర్టును గౌరవిస్తున్నామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ మంగళవారం వెళ్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. హోంమంత్రి అమిత్ షా పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారని చెప్పారు.